
కోట్లాదిమంది ఆరాధ్యదైవమైన శ్రీవెంకటేశ్వరుని భారీ విగ్రహం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో రూపుదిద్దుకుంటోంది. 95 అడుగుల విగ్రహం భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతోంది. ఈ విగ్రహం పూర్తయితే తిరుపతి వచ్చిన భక్తులంతా తిరువణ్ణామలై రావాల్సిందేనని, ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఈ వెంకటేశ్వరుని విగ్రహం సందర్శకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు.
రాళ్లను అద్భుతమైన కళాఖండాలుగా తీర్చిదిద్దడంలో తమిళులకు ప్రత్యేకత వుంది. తంజావూరు, మధురై, మహాబలిపురంలలోని శిల్ప సౌందర్యమే ఇందుకు నిదర్శనం. కన్యాకుమారిలోని తిరువళ్లువర్ విగ్రహం మరో ఉదాహరణ. ఇదే ఆదర్శంగా తీసుకున్న శిల్పులు ఏకంగా 95 అడుగుల ఎత్తయిన తిరుమలేశుని విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మరో విశేషముంది. సాధారణంగా రాళ్లను తొలచి విగ్రహాలుగా మలుస్తారు. కానీ ఇక్కడ కొండనే విగ్రహంగా మలచడం విశేషం.
పెరుమాళ్గా మారిన శివుడు
తిరువణ్ణామలై నుంచి వేలూరుకు వెళ్లే దారిలో 32 కి.మీ దూరంలో వున్న గాంగేయలూరులో ఈ అద్భుతం రూపు దాలుస్తోంది. వాస్తవానికి ఈ విగ్రహం విషయంలో ముందు అనుకున్నదొకటి. కానీ జరుగుతున్నది మరొకటి. 1998లో ఇక్కడ శివుడి (చంద్రశేఖరుడు) విగ్రహాన్ని తయారు చేయాలని కంచి శంకరమఠం నిర్వాహకులు భావించారు. ఇందుకోసం గాంగేయలూరు చుట్టూ వున్న కొండలను పరిశీలించారు.

భారీ విగ్రహం అంత దూరం తీసుకొచ్చే ప్రయత్నంలో దెబ్బతినే అవకాశం కూడా వుందని నిపుణులు హెచ్చరించడంతో నిర్వాహకులు ఆందోళన చెందారు. ఈ కారణంగా విగ్రహం తయారీ పనులు నిలిచిపోయాయి కూడా. అయితే విగ్రహం పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడం మంచిది కాదని భావించిన గ్రామస్తులు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీని ఆశ్రయించారు. అప్పట్లో తితిదే పాలకమండలి నుంచి ఎన్.యువరాజ్ నేతృత్వంలోని పలువురు సభ్యులు వచ్చి ఈ పనులను పరిశీలించి, విగ్రహాన్ని పూర్తి చేసేందుకు ముందుకొచ్చారు. అంతేగాక గాంగేయలూరులోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తీర్మానించారు. ఎట్టకేలకు పనులు ఊపందుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్నామలై, పడవేడు, రేణుకామ్మాళ్ వంటి ప్రసిద్ధ ఆలయాలున్న తిరువణ్ణామలై జిల్లాలో పెరుమాళ్ విగ్రహమున్న గాంగేయలూరు కూడా మరో పుణ్యక్షేత్రంగా మారడం ఖాయం.
- ఎస్కేఎండీ గౌస్బాషా, చెన్నై
No comments:
Post a Comment